ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ...

సాక్షి, కాకినాడ: ఉగాదికి ‘అందరికి ఇళ్లు’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ నుంచి ప్రారంభిస్తారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌  తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఇళ్లు ఇచ్చిందిలేదన్నారు. 25 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం ప్రపంచ రికార్డు అవుతుందన్నారు. తప్పనిసరి అయితే తప్ప.. అసైన్డ్ భూములను తీసుకోవద్దని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని పేర్కొన్నారు. స్వచ్ఛందం గా భూములు ఇచ్చేవారికి పరిహారం ఇచ్చి భూ సేకరణ చేస్తున్నామని వివరించారు. గోదావరి డెల్టాకు రబీకి కావాల్సిన నీరు ఉందన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన పైపుల వల్ల నీరు దిగువకు తక్కువగా వస్తుందన్నారు. ఈ సమస్య పరిష్కారం అయిందన్నారు. జిల్లాలో ఇసుక సమస్యను తీర్చేందుకు అనుమతులు ఉన్న రీచ్ లను ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.


3.50 లక్షల మంది  లబ్ధిదారులు గుర్తింపు..
అందరికి ఇళ్లు పథకంలో జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మంది  లబ్ధిదారులను గుర్తించామని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో 7,700  ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు. 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ భూసేకరణ జరపలేదని పేర్కొన్నారు. విద్య, వైద్య, దేవాదాయ, వక్ఫ్ బోర్డు భూములను సేకరించలేదని వివరించారు. అసైన్డ్ భూములను రైతుల అంగీకారంతోనే అవార్డు ప్రకటించామని చెప్పారు.


అది వాస్తవం కాదు..
తెలుగు యునివర్సిటీలో 10 మంది విద్యార్థులు, 14 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, ఆ యూనివర్శిటీకి 25 ఎకరాల భూమి అవసరం ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నామన్నారు. యునివర్శిటీకి నన్నయ్య యునివర్శిటీలో 5 ఎకరాలు కేటాయించాలని ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. యునివర్సిటీ భూములపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బలవంతపు భూసేకరణ చేస్తున్నామనేది వాస్తవం కాదని..  మీడియా ఇలాంటి వార్తలు రాసేటపుడు అధికారుల నుండి వివరణ తీసుకోవాలని కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి కోరారు.